న్యూఢిల్లీ: కోవిడ్19 మహమ్మారి వేళ విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్పై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశం ప్రకారం వందేభారత్ విమానాలను నడిపించినట్లు మంత్రి తెలిపారు. ఈ విమానాల ద్వారా సుమారు 45 లక్షల మంది విదేశాల నుంచి భారత్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. అత్యధిక శాతం ప్రయాణికులు కేరళకు వచ్చినట్లు వెల్లడించారు. భారత సంతతి సంక్షేమ నిధి కోసం 33.5 కోట్లు వెచ్చించినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. భాగస్వామ్య ప్రభుత్వాలు లేకుంటే.. ఇంత భారీ స్థాయిలో ప్రజల తరలింపు సాధ్యం అయ్యేదికాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అద్వీతీయమైన రీతిలో దౌత్యం నిర్వహించడం వల్లే .. విదేశాల నుంచి ప్రయాణికుల తరలింపు సక్సెస్ అయినట్లు మంత్రి వెల్లడించారు. 27 దేశాల నుంచి భారతీయులను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్నవారికి ఆహార పదార్ధాలను, మెడిసిన్స్ను సరఫరా చేస్తున్నామని, దీని కోసం సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలతో అంగీకారం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మళ్లీ ఉద్యోగాలు కల్పించే ఎజెండాతో పనిచేస్తున్నామన్నారు.