వలిగొండ: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంతో పాటు మండ లంలోని టేకులసోమారం, నెమిలకాల్వ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా నిర్మించి న వైకుంఠధామాలను, పల్లె ప్రకృతి వనాలను, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు.
కమ్మగూడెం గ్రామ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్న ప్రదేశాన్ని పరిశీలించగా కూలీలు గత నాలుగు నెలలుగా కూలీ డబ్బులు రాలేదని కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే స్పందించిన కలెక్టర్ ఆలస్యం చేయకుండా కూలీల డబ్బులు చెల్లించాలని అధికారులకు సూచించి, కూలీలందరూ కరోనా టీకాను వేయించుకోవాలని సూచించారు. అనంతరం కమ్మగూడెం తుమ్మలగూడెం గ్రామాల మధ్య ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని ఆర్అండ్బీ ఈఈ శంకర్ను ఆదేశించారు.
అంతకుముందు వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కరోనా వ్యాక్సినేషన్ 100శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో మందడి ఉపేందర్రెడ్డి, ఎంపీపీ నూతి రమేశ్రాజ్, ఎంపీడీవో గీతారెడ్డి, తహసీల్దార్ నాగలక్ష్మి, సర్పంచ్లు చేగూరి భిక్షపతి, బోళ్ల లలిత, తీగుళ్ల కృష్ణయ్య, ఎంపీ వో కేధారీశ్వర్, ఆర్ఐ కరుణాకర్రెడ్డి రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.