నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి రోడ్, బస్టాండు మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది.
75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలకు సంకేతంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 750 మీటర్ల పొడవు కలిగిన జాతీయ జెండాను ప్రదర్శించడం ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశేష సంఖ్యలో జిల్లా నలుమూలల నుండి హాజరైన అన్ని వర్గాల వారు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఉప్పొంగిన ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటీష్ వలస పాలకుల చేతిలో బందీ అయిన భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కల్పించేందుకు అనేకమంది సమర యోధులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. వారందరికీ ప్రభుత్వం తరఫున, జిల్లా ప్రజలందరి పక్షాన నివాళులు అర్పిస్తున్నామన్నారు.
వారి త్యాగాలు, జాతీయ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయని అన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు రాజేశ్వర్, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు పాల్గొన్నారు.