సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. బుధవారం సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడుకలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో సమైక్యమై 75ఏండ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజల సమైక్యతను చాటుతూ ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు అన్ని జిల్లాల్లో ఘనంగా తెలంగాణ జాతీ య సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. ఈ నెల14 నుంచి 18 వరకు అన్ని ప్రభుత్వ భవనాలను విద్యుత్దీపాలతో అలంకరించాలని, 16న అన్ని శాసన సభా నియోజకవర్గ కేంద్రాల్లో 15వేల మంది ప్రజలతో ర్యాలీ నిర్వహించాలని, ఈ ర్యాలీలో 10 వేల జాతీయ జెండాల ను ప్రదర్శించాలని, అనంతరం అనువైన స్థలంలో సమావేశం నిర్వహించి జాతీయ గీతాలాపన చేయాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భోజన సౌకర్యం కల్పించాలన్నారు. 17న జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రసంగం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులను, గిరిజన అధికారులు, ఉద్యోగులను హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సమావేశానికి ప్రత్యేక బస్సుల ద్వారా పంపించాలన్నారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు అందరూ పాల్గొనేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవాలను మంత్రి హరీశ్రావు, స్థానిక శాసన సభ్యుల సహకారంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీపీవో దేవకీదేవి, జడ్పీ సీఈవో రమేశ్, డీపీఆర్వో రవికుమార్, డీవైఎస్వో నాగేందర్, ఏవో కలెక్టరేట్ అబ్దుల్ రెహమాన్, ఎంవీఐ జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.