న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరిన వేళ బుధవారం మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో టీకాలు తగ్గిపోతున్నాయని, కరోనా మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దృష్టి మళ్లించడం, అసత్యాలను వ్యాప్తి చేయడం, వాస్తవాలను దాచడమే కేంద్ర ప్రభుత్వ విధానమని ఆరోపించారు. ఈ మేరకు ఈ మేరకు టీకా పంపిణీ, కొవిడ్ మరణాలను సూచించే గ్రాఫ్లను ట్విట్టర్లో షేర్ చేశారు. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 4,529 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 2,83,248 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా 2.67 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.