న్యూఢిల్లీ: టీకాల కార్యక్రమం తప్పుల తడకగా ఉందని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తలంటు పోసింది. భిన్న ధరలు, కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం వంటి విమర్శలు ప్రస్తావించింది. 2021 చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వం తెలుపగా.. అడ్డంకుల మాటేమిటి అని కోర్టు అడిగింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ఎన్ రావు, ఎస్ రవీంద్రభట్తో కూడిన ధర్మాసనం టీకాల సమస్యపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వేరువేరు వయసుల వారికి టీకా సరఫరాలో వ్యత్యాసాలు ఎత్తిచూపింది. “45 సంవత్సరాలు పైబడినవారికి అవసరమైన మొత్తం టీకాలు కేంద్రం సేకరిస్తుంది. కానీ 18-44 సంవత్సరాల వయసువారికి అవసరమైన టీకాల్లో విభజన ఉంది. అంటే 50 శాతం ఉత్పాదకుల నుంచి రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. మిగిలినవి ప్రైవేటు హాస్పిటల్స్ కు పోతాయి అంటున్నారు. దీనికి వాస్తవిక ప్రాతిపదిక ఏమిటి?” అని కోర్టు నిలదీసింది. “45 పైచిలుకు వయసువారిలో మరణాలు ఎక్కువని మీ వాదన. కానీ సెకండ్ వేవ్ లో ఈ వయసువారు పెద్దగా ప్రభావితులు కాలేదు. 18-44 వయసువారు ఎక్కువగా దెబ్బతిన్నారు. టీకాలు సేకరించడం లక్ష్యమైతే 45 పైచిలుకువారినే కేంద్రం ఎందుకు ఎంచుకుంది?”అని కోర్టు ప్రశ్నించింది. మే నెలలో సుమారు 50 శాతం కేసులు 18-40 వయసువారివేనని డేటా ద్వారా తెలుస్తున్నదని కోర్టు గుర్తు చేసింది. టీకాలపై కేంద్రం కన్నా రాష్ట్రాలు ఎక్కువ ధర ఎందుకు చెల్లించాలో వివరించమని కోర్టు ఆదేశించింది. ధరను నిర్ణయించే అధికారాన్ని ప్రస్తావిస్తూ, ధరను ఉత్పాదకుల నిర్ణయానికి ఎందుకు వదిలేసినట్టు అని అడిగింది. ఇక గ్లోబల్ టెండర్ల ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్రం తరఫు న్యాయవాది ఇది అకడమిక్ ప్రశ్న అని వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. అకడమిక్ ప్రశ్న కాదని, ముంబైకి స్పుత్నిక్-వీ కంపెనీ టెండర్లు పంపిందని గుర్తు చేసింది. విదేశాల నుంచి మీరే కొనుగోలు చేయండని రాష్ట్రాలకు చెప్పడమంటే వారిని గాలిగి వదిలెయ్యడమే అని పేర్కొన్నది. ఇక కోవిన్ లో రిజిస్టర్ చేసుకున్నవారికే టీకాలు అన్న నిబంధనపై కూడా కోర్టు కేంద్రాన్ని నిలదీసింది. “గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఆచరణ సాధ్యమేనా?” అని సందేహం వ్యక్తం చేసింది. “మేం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను నడపబోవడం లేదు.. భిన్నస్వరాలు వినేందుకు వేదిక కల్పించడమే ఇదంతా.. కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని మా ఉద్దేశం” అని కోర్టు వివరించింది.