UP Polls | ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యూపీలోని ఓ జిల్లా ప్రజలు అధికారులకు, నేతలకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు వినకపోతే.. ఎప్పటికీ వినరని భావించారో ఏమో గానీ.. తమ రోడ్లను బాగు చేయకపోతే మాత్రం ఎన్నికలను బాయ్కాట్ చేసేస్తామని హెచ్చరించారు. తమ రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని యూపీలోని ఈఠ్ సర్దార్ నియోజకవర్గంలోని కుల్లా హబీబ్పూర్ గ్రామ ప్రజలు కొన్ని రోజులుగా మొత్తుకుంటున్నారు. అయినా అధికారుల నుంచి, నేతల నుంచి స్పందన లేదు. దీంతో అదును కోసం వేచి చూసి, సరిగ్గా ఎన్నికల సమయంలో అధికారులకు, నేతలకు ఝలక్ ఇచ్చారు. వెంటనే రోడ్లు బాగు చేయించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు దిగొచ్చారు. వెంటనే రోడ్లను బాగు చేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు శాంతించారు.
కుల్లా హబీబ్పూర్ గ్రామంలో దాదాపు వెయ్యి మంది జనాభా వుంటారు. రోడ్లు వేయించకపోతే వోటు వేయం (నో రోడ్.. నో వోట్) అంటూ ఒక్కసారిగా అధికారుల ముందే నినాదాలు అందుకున్నారు. వర్షాలు, వరదల కారణంగా రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, తమ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సబ్ డివిజనల్ అధికారి శివకుమార్ సింగ్ స్పందించారు. తాము తహశీల్దార్ ను పంపించామని, ప్రజల సమస్యను అర్థం చేసుకొని, వెంటనే పరిష్కరించాలని తాను ఆదేశించినట్లు సబ్ డివిజనల్ అధికారి పేర్కొన్నారు.