లక్నో : ప్రేమకు హద్దులు లేవు.. ప్రేమించుకోవడానికి సరిహద్దులు లేవు.. ఇంకేముంది.. పాకిస్తాన్కు చెందిన ఓ యువతి, ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడి ప్రేమలో పడిపోయింది. మనసారా ప్రేమించుకున్న ఆ ప్రేమికులిద్దరూ జీవితంలోనూ ఒక్కటయ్యారు.
ఉత్తరప్రదేశ్ ఫరుక్కాబాద్కు చెందిన 23 ఏండ్ల జర్దోజీ ఆర్టిస్ట్ మహ్మద్ జమల్.. ఫేస్బుక్ వేదికగా ఎరాం అనే అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా జమల్ ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత.. ఆమెది పాకిస్తాన్ అని తెలిసింది. అయినప్పటికీ వారిద్దరూ వెనుకడుగు వేయలేదు. ప్రేమించుకున్నాం.. ఇక మనువాడుకుందాం.. అని ముందుకెళ్లారు. ఇటీవల పాకిస్తాన్కు వెళ్లిన జమల్.. జూన్ 17న ఎరాంను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే జర్దోజీ ఆర్టిస్ట్ ఇండియాకు తిరిగి రానున్నారు.
ఈ సందర్భంగా జమల్ తండ్రి అలీముద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. జమల్, ఎరాం జంట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. వారిద్దరూ ఇండియాకు రాగానే యూపీలో తమ సంప్రదాయాల ప్రకారం వివాహం ఘనంగా నిర్వహిస్తామని చెప్పాడు. ఈ జంట వివాహానికి ఫరుక్కాబాద్ జిల్లా యంత్రాంగం కూడా సహకరిస్తామని తెలిపినట్లు అలీముద్దీన్ పేర్కొన్నాడు.