ముంబై, జూన్ 15:ఆదాయ పన్నుశాఖ ఇటీవల ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించా లంటూ ట్వీట్ చేశారు. అయితే వారం రోజులు దాటినా ఈ కొత్త ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఈ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చి వారం రోజులు అయినా సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో ఎంతోమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లాగ్-ఇన్ కావడానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటోందట. పన్ను రిటర్న్స్ దాఖలును మరింత సులభతరం చేసే ఉద్దేశ్యంతో జూన్ 7న కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కొత్త పోర్టల్ http://www.incometax.gov.in ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొదటిరోజు సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిర్మలా సీతారామన్ స్పందించడంతో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తోన్న ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని తమ సంస్థ దీనిపై పని చేస్తోందని చెప్పారు. ఇది జరిగి వారమైనా సాంకేతిక సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లాగ్ఇన్కు ఎక్కువ సమయం పడుతోంది.