ఈ ఏడాది జూలై నుంచి పక్కాగా అమలుచేస్తాం
బయోవ్యర్థాల నిర్వహణ నిబంధనలు కఠినతరం
కాలుష్య నియంత్రణ మండలి సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): వచ్చే జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం అమలు చేస్తున్నట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం అరణ్య భవన్లో జల, వాయు, శబ్దకాలుష్య నియంత్రణ- నివారణ, బయో మెడికల్ వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీజలాల కాలుష్య నియంత్రణకు తీసుకొంటున్న చర్యలపై మంత్రి.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నగరాలు, పట్ణణాల్లో కాలుష్యం, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రం లో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ)లో ఘన, ద్రవ రూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలని, కొత్తగా మరికొన్ని ఎస్టీపీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని, దానికోసం డీపీఆర్లు తయారు చేయాలని సూచించారు. జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలను, ఇతర జీవ రాశులను రక్షించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని రకాల కాలుష్యాల నియంత్రణకు పీసీబీ తీసుకొంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్ మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 11 కామన్ బయో మెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాల్లో జీవ వైద్య(బయోమెడికల్) వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా బయోవ్యర్థాలను తరలించే వాహనాలను తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జీపీఎస్తో అనుసంధానం చేసిందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించని దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలని స్పష్టం చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కాలుష్య కారక పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చటం, పంట వ్యర్థాలను తగులబెట్టడం వంటివి తగ్గాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, నీటిపారుదలశాఖ ఈఎన్సీ (జనరల్) మురళీధర్, సీఈ రఘు, పర్యావరణ శాఖ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.