వాషింగ్టన్: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా సడలించింది. ఈ మేరకు చేసిన నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేశారు. ఈ రూల్స్ ప్రకారం, అమెరికాకు వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువపత్రాలు చూపించాలి.
చైనా, భారత్, యూరప్ దేశాలపై విధించిన కఠిన ఆంక్షలు కూడా నవంబరు 8 నుంచి సడలిస్తున్నట్లు ఈ ఉత్తర్వులు తెలిపాయి.కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులపై కఠినమైన ఆంక్షలు విధించారు.
ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్కు చెందిన 26 దేశాలు, ఐర్లాండ్, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ దేశాలను సందర్శించిన వారిని అమెరికాలోకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే దేశాల వారీ ఆంక్షలను తొలగించి, ప్రధానంగా వ్యాక్సినేషన్ ఆధారంగా ఆంక్షలు విధించాలని బైడెన్ నిర్ణయించారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం 18 ఏళ్లలోపు వారు, వైద్య సమస్యలు ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోయినా అమెరికాలోని అనుమతిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా 10 శాతం కన్నా తక్కువ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన 50 దేశాల నుంచి వచ్చే నాన్-టూరిస్టులు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా అమెరికాలో ప్రవేశించడానికి అర్హులే.
అయితే ఈ అనుమతి కావాలంటే 60 రోజుల కన్నా ఎక్కువ కాలం యూఎస్లో ఉండకూడదు. అలా ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవలసిందే. ఈ కొత్త నిబంధనలను ప్రయాణికులందరికీ తెలియజేయాలని విమానయాన సంస్థలకు బైడెన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరించుకోవాలని చెప్పింది. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులందరూ కూడా విమానం ఎక్కే72 గంటల్లోపు కరోనా టెస్టు చేయించుకొని నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రయాణించడానికి అనుమతి తీసుకున్న వ్యక్తులు ప్రయాణానికి 24 గంటల్లోపే కరోనా టెస్టు చేయించుకొని రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా రెగ్యులేటరీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సరిపోతుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది.