హూస్టన్: ఉక్రెయిన్కు నిధులను ఇవ్వడం కాదు.. దేశంలోని స్కూళ్లలో భద్రతను పెంచేందుకు నిధులను కేటాయించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. కొన్ని రోజుల క్రితం టెక్సాస్లో ఓ ఉన్మాది స్కూల్లోకి ప్రవేశించి 19 మంది విద్యార్థులను కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ హూస్టన్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్కు బిలియన్ల డాలర్లను ఇవ్వగలిగినప్పుడు, మన ఇంట్లో మన పిల్లల్ని సురక్షితంగా ఉంచేందుకు కూడా అన్న చర్యలు చేపట్టాలన్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ట్రిలియన్ల డాలర్లను ఖర్చు చేశామని, కానీ అక్కడ ఏమీ లభించలేదని ట్రంప్ అన్నారు. ప్రపంచ దేశాలను చక్కదిద్దడం కన్నా ముందు మన దేశంలోని స్కూళ్లను పిల్లలకు సురక్షితంగా ఉండేలా మార్చుకోవాలన్నారు. కఠిన తుపాకీ చట్టాల అమలును ట్రంప్ వ్యతిరేకించారు. తమల్ని తాము రక్షించుకునేందుకు ఆయుధాలు అవసరమని ఆయన అన్నారు.