న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. 2022 సంవత్సరానికి 82 వేల స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు ఇండియాలోని యూఎస్ మిషన్ వెల్లడించింది. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో 20 శాతం మంది భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెండేళ్లు వీసా జారీలో జాప్యం జరిగిందని, కానీ ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులకు వీసాలు అందడం సంతోషకరంగా ఉందని అమెరికా అధికారి పాట్రీసియా లాసినా పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో సుమారు 82 వేల స్టూడెంట్ వీసాలను జారీ చేసినట్లు తెలిపారు. న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో స్టూడెంట్ వీసాలకు ప్రాసెసింగ్ జరిగినట్లు పాట్రీసియా చెప్పారు.