సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): అమెరికా డాలర్లను చూపించి.. దేశీయ కరెన్సీని కొట్టేస్తున్న ఇరాన్కు చెందిన గ్యాంగ్ను శనివారం రాచకొండ పోలీసులు, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం… ఇరాన్ దేశానికి చెందిన మహ్మద్ హుస్సేన్, వహీద్ రజబ్, నసీర్ అభిదిలు 18 నెలల కిందట ఇరాన్ నుంచి ఢిలీకి ఈ-వీసా మీద వచ్చారు. ఇక్కడ దుస్తులు కొనుగోలు చేసి … ఇరాన్ రాజధాని టెహ్రాన్కు పంపి వ్యాపారం చేస్తున్నారు. ఢిల్లీలో లాక్డౌన్ పెట్టడంతో ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చి టోలీచౌకి పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మోసాలకు పాల్పడాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా అమెరికా డాలర్లను ఎక్సేంజ్ చేయాలంటూ టార్గెట్ చేసిన వ్యాపారులను కోరుతారు.. గ్యాంగ్లోని ఇద్దరు వ్యాపారులను మాటల్లో పెడుతుండగా.. మరొకరు వ్యాపారి కౌంటర్లో నుంచి నగదును కొట్టేస్తున్నారు.. ఇలా ఎల్బీనగర్ ప్రాంతంలో వరుసగా రెండుసార్లు వ్యాపారుల దృష్టి మళ్లించి దాదాపు రూ.55 వేల వరకు నగదును కాజేశారు.. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. సీసీ కెమెరాల ఆధారంగా శనివారం ఎల్బీనగర్ పరిధిలో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఐదుగురు వ్యాపారుల దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడినట్లు తేలింది. నిందితుల నుంచి 811 అమెరికా డాలర్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.