ఘనంగా ఉత్సవాల్ని నిర్వహిద్దాం: హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, జూన్8(నమస్తే తెలంగాణ): రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉర్దూ జర్నలిజానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్పచరిత్ర ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఉర్దూ జర్నలిజం ఉత్సవాలను హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్వహించిన ముఖ్యుల సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏండ్లు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమన్నారు. హైదరాబాద్లో ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమని అన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. రెండు రోజుల పాటు రవీంద్రభారతిలో ఈ ఉత్సవాల నిర్వహణపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని మహమూద్ అలీ తెలిపారు. ఉత్సవాల సన్నాహక కమిటీని వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇంటర్ మీడియట్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్, తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ, ప్రముఖ ఉర్దూ విద్యావేత్త, ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతీఖ్ అహ్మద్, ఫ్యాప్సీ మాజీ అధ్యక్షుడు అనిల్రెడ్డి, తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఏ మాజీద్, గౌస్, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఫైసల్ అహ్మద్, హాబీబ్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.