ముంబై: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రూ.21 కోట్ల విలువ చేసే 7 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకుంది. వారు ఆ యురేనియంను రూ.25 కోట్లకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా ఠాణే పోలీసుల సాయంతో ఆచూకీ తెలుసుకుని వలపన్ని వారిని పట్టుకున్నారు. యురేనియంను స్వాధీనపర్చుకున్నారు. అది డిప్లెటెడ్ యురేనియం అని తెలుస్తున్నది. ఇంతకూ అణువిద్యుత్కేంద్రాల్లో ఉండాల్సిన ఆ అరుదైన లోహం నల్లబజారులోకి ఎలా వచ్చింది. జిగర్ పాండ్యా (27), అబూ తాహిర్ (31) అనే ఇద్దరు వ్యక్తులను ఏటీఎస్ అరెస్టు చేసింది. 7 కిలోల యురేనియంను రూ.25 కోట్లకు ఆన్లైన్లో అమ్మడానికి వారు ప్రయత్నించారు. ఆ సంగతి తెలుసుకుని డమ్మీ కస్టమర్ను పోలీసులు పంపారు. నిందితులు శాంపిల్ కూడా ఇచ్చారు. దానిని భాభా అటామిక్ సెంటర్లో పరీక్షిస్తే అది సహజమైన యురేనియం అని రిపోర్టు వచ్చింది. దాంతో ఆ ఇద్దరినీ 1962 అటామిక్ ఎనర్జీ చట్టం కింద అరెస్టు చేశారు. ఇంతకూ ఆ ఇద్దరి చేతికి యురేనియం ఎలా వచ్చింది? అనేది ప్రశ్న. మాన్ఖుర్ద్లో తాహిర్ తండ్రికి ఓ తుక్కు దుకాణం ఉంది. రెండేళ్ల క్రితం ఓ ఫ్యాక్టరీకి చెందిన వ్యర్థాలు ఆ దుకాణంలో అమ్మారు. ఆ తుక్కులో యురేనియం కూడా ఉంది. యురేనియం సహజంగానే ఎక్కువ బరువు ఉంటుంది. అదే దాన్ని పట్టిచ్చే లక్షణం. ఆ లోహాన్ని దాచిపెట్టి లాక్డౌన్ రోజుల్లో తాహిర్ పాండ్యాకు ఆ బరువైన లోహం గురించి చెప్పాడు. పాండ్యా తనకు తెలిసిన వర్గాల ద్వారా అది యురేనియం అని ధ్రువీకరించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆన్లైన్లో ఆ యురేనియాన్ని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఆ సంగతి ఠాణే పోలీసుల ద్వారా ఏటీఎస్ దృష్టికి వచ్చింది. మొదట ఏటీఎస్ అది ఫేక్ యురేనియం అనుకున్నారు. కానీ శాంపిల్ పరీక్ష తర్వాత అది నిజమైన యురేనియం అని తెలిసిపోయింది. 2016 లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రూ.24 కోట్ల విలువ చేసే యురేనియం కలిగిన ఇద్దరును ఠాణే పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లోకూడా నిందితుల్లో ఒకరు తుక్కు వ్యాపారి కావడం గమనార్హం. యురేనియంను పరిశ్రమల్లో కొన్ని ప్రత్యేక అవసరాలకు వినియోగిస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత తుక్కు కింద అమ్మేస్తారు. అలా అమ్మకుండా యురేనియంను ప్రభుత్వానికి అప్పగించేలా చూడాలని అణుశక్తి సంస్థ మాజీ అధిపతి అనిల్ కాకోద్కర్ చేసిన సూచన ఇంకా అమలులోకి వచ్చిన దాఖలాలు కనిపిచడం లేదు. అందుకు తాజా ఠాణే కేసు ఉదాహరణ.