ముంబై,జూలై : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ‘మహీంద్రా ఎక్స్యూవీ700’ త్వరలోనే మార్కెట్లోకి రానున్నది. ఇందులో సరికొత్త ఫీచర్ ను అందించనున్నారు. “డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్” అలెర్ట్ ఫీచర్ గురించి కంపెనీ ఓ టీజర్ వీడియోని రిలీజ్ చేసింది. ఇదొక సేఫ్టీ ఫీచర్, ఇది డ్రైవర్ అలసటగా ఉన్న సమయంలో గానీ, నిద్రలోకి జారుకోవడాన్ని గుర్తించి వెంటనే అలెర్ట్ చేస్తుంది. దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా రాత్రి సమయాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ అలెర్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ టెక్నాలజీలో డ్రైవర్ డ్రైవింగ్ తీరును గుర్తించడానికి సెన్సార్లు ఉంటాయి. ఇవి స్టీరింగ్ ,పెడల్స్పై డ్రైవర్ వ్యవహరించే తీరును పరిగణలోకి తీసుకొని, వారిని అలెర్ట్ చేస్తాయి. ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే కొన్ని రకాల హై-ఎండ్ కార్లలో అందుబాటులో ఉన్నది. ఈ అలెర్ట్లో భాగంగా డ్యాష్బోర్డుపై వార్నింగ్ సైన్ ప్రకాశిస్తుంది. కొన్ని కార్లలో అయితే, ఇది వాయిస్ ఆధారిత వార్నింగ్ అలెర్ట్స్ రూపంలో కూడా ఉంటుంది. ఎక్స్యూవీ700లో కంపెనీ ఇప్పటికే వాయిస్ ఆధారిత హై-స్పీడ్ అలెర్ట్ను అందించనున్నది. మహీంద్రా తమ సరికొత్త ఎక్స్యూవీ700లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్ను అందిస్తున్నది.