న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లులపై ఎలాంటి చర్చ జరుగకుండానే ఆమోదించారన్న ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. యూపీఏ ప్రభుత్వం ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బిల్లును పార్లమెంట్లో ఆమోదించిందని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. 2004-14 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్చ జరుపకుండానే 18 బిల్లులను వేగంగా ఆమోదించారని విమర్శించారు. 17 బిల్లులను 72 నిమిషాల్లో.. అంటే సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బిల్లును ఆమోదించారని మండిపడ్డారు.
‘2006 ఆగస్ట్ 7న లోక్సభలో కేవలం 14 నిమిషాల్లో ప్రభుత్వ సెక్యూరిటీల బిల్లును ఆమోదించారు. 2007లో నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లును నాలుగు నిమిషాలలో ఆమోదించారు. బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ), నేషనల్ టాక్స్ ట్రిబ్యునల్ (సవరణ) బిల్లులు ఐదు నిమిషాలలో ఆమోదించారు. 2007 మార్చి 19న పన్ను చట్టాల (సవరణ) బిల్లును కేవలం రెండు నిమిషాల్లో క్లియర్ చేశారు’ అని కేంద్ర మంత్రులు వెల్లడించారు. ఈ వివరాలను సమావేశం అనంతరం మీడియాకు విడుదల చేశారు.