ఆయన ఓ ప్రభుత్వ అధికారి.. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా.. పారదర్శకంగా పాలన సాగించిన ఓ మంచి అధికారి.. ఓ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు ఆ అధికారిపై గూండాలు ఏడుసార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయినా బెదరలేదు.. లొంగలేదు.. గూండాల కాల్పుల్లో కంటి చూపుతో పాటు వినికిడి కోల్పోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు.. సివిల్స్లో విజయకేతనం ఎగురవేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయనే యూపీకి చెందిన రింకూ సింగ్ రహీ. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 683వ ర్యాంకు సాధించాడు.
ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ రహీ.. 2004లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రావిన్సియల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా చేరాడు. ముజఫర్నగర్లో స్కాలర్సిష్లకు సంబంధించిన రూ. 83 కోట్ల కుంభకోణాన్ని రింకూ సింగ్.. వెలుగులోకి తెచ్చాడు. దీంతో అతనిపై కొంత మంది గుండాలు తుపాకీతో ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన రింకూ.. కంటి చూపుతో పాటు వినికిడి కోల్పోయాడు. ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్నది. ఇక ఈ దాడిలో ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా, నలుగురికి పదేండ్ల పాటు జైలు శిక్ష విధించారు.
అయితే యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్కు రింకూ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. కొన్నేండ్ల పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు రింకూ క్లాసులు కూడా బోధించారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల కోరిక మేరకు ఆయన కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమై.. 683వ ర్యాంకు సాధించాడు. రింకూకు ఏడేండ్ల కుమారుడు ఉన్నాడు.