నోయిడా: కరోనా మహమ్మారి బారినపడి ఓ సీనియర్ జర్నలిస్టు కన్నుమూశారు. నోయిడాకు చెందిన జర్నలిస్టు కపిల్ దత్తా (65)కు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దాంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నోయిడా మీడియా క్లబ్ అధ్యక్షుడు పంకజ్ పరాశర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
సీనియర్ జర్నలిస్ట్ కపిల్ దత్తా మరణవార్త తమను కలచివేసిందని నోయిడా మీడియా క్లబ్ ప్రకటించింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఆయన తమకు తండ్రి లాంటి వారని, జర్నలిజానికి సంబంధించి ఆయన నుంచి తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వారు ప్రకటనలో పేర్కొన్నారు.