Terrorist Arrest in UP | ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు శుక్రవారం తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), జైషే మహ్మద్ ఉగ్రవాది మహ్మద్ నదీమ్ను అరెస్ట్ చేశారు. యూపీలోని సహరాన్పూర్లో నదీమ్ను అదుపులోకి తీసుకుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్శర్మను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు మహ్మద్ నదీమ్.
మహ్మద్ నదీమ్కు నేరుగా జైషే మహ్మద్, టీటీపీలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. తమకు నిఘా వర్గాల నుంచి అందిన ప్రత్యేక సమాచారం మేరకు ఆయన్ను అరెస్ట్చేశామని పోలీసులు అన్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, ఆజంగఢ్లో ఇస్లామిక్ స్టేట్ కార్యకర్త సబాబుద్దీన్ అజ్మీని అరెస్ట్ చేసిన రెండు రోజులకు జైషే మహ్మద్ సభ్యుడిని యూపీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. అతడి వద్ద నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలతోపాటు చట్ట విరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాన్ని యూపీ ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.