హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలులో ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ప్రసంశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో తెలంగాణ ముందుందని, ఇదే స్ఫూర్తితో ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ఆదాయం పెరిగే కార్యక్రమాలను చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలని సూచించారు. సోమవారం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర గ్రామీణావృద్ధి శాఖ నరేంద్రనాథ్ సిన్హాకు రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి తదితర కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. దీంతో గ్రీనరీ పెరగడమే కాకుండా గత కొన్నేళ్లుగా వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గిందన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్ యూనిట్, ట్రాక్టర్ ఉన్నాయని, గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.227 కోట్ల నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 8,684 జీపీలు ఉండేవని, ప్రతీ గిరిజన తండా, గిరిజన గూడెలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కు పెరిగాయన్నారు.
గ్రామాల్లో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని, వాటిల్లో 85 శాతం మొక్కలు బతికే విధంగా సంబంధిత సర్పంచులు, కార్యదర్శులకు బాధ్యత అప్పగించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.10వేల కోట్లకుపైగా బ్యాంకు రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ ఆదాయ పెంపు పథకాలు వర్తింప చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రసాద్, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవ రావు, సెర్ప్ సీఓఓ రంజిత, శాట్ డైరక్టర్ సౌమ్య, సెర్ప్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.