కేంద్రమంత్రులు ప్రెస్మీట్ పెట్టాలన్నా పీఎంవో అనుమతి తీసుకోవాల్సిందే
‘360 డిగ్రీల ఎవాల్యుయేషన్’ సరిగాలేదు
ప్రభుత్వానికి అనుకూలంగా లేని అధికారులను పక్కనపెట్టేందుకే ఆ విధానం!
మోదీ సర్కారుపై మాజీ ఐఏఎస్ అనిల్ స్వరూప్ సంచలన వ్యాఖ్యలు
అభద్రతలో ప్రధాని నరేంద్రమోదీ
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి
న్యూఢిల్లీ, మే 31: ప్రధాని నరేంద్రమోదీ తన పదవి పట్ల అభద్రతతో ఉన్నారా? క్యాబినెట్ సహచరులను కూడా నమ్మడంలేదా? అందుకే కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించాలంటే కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధన పెట్టారా? మాజీ ఐఏఎస్, కేంద్ర మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ తన తాజా పుస్తకం ‘నో మోర్ ఏ సివిల్ సర్వెంట్’లో వెలువరించిన విషయాలు సంచలనంగా మారాయి.
ఎవరీ అనిల్ స్వరూప్?
అనిల్ స్వరూప్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2014-16లో బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 2016-18 విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అంతకుముందు మన్మోహన్సింగ్ యంత్రాంగంలో కూడా పనిచేశారు. 2018లో పదవీవిరమణ చేశారు.
అధికారాలు ఇవ్వరు!
ప్రధాని మోదీ అభద్రతాభావంతో ఉన్నారు. ఆయన విద్యార్హతలు సాధారణమైనవే. అయినప్పటికీ, తన క్యాబినెట్ సహచరులకు అధికారాలను ఇవ్వరు. మద్రాస్ స్టేట్కు సీఎంగా పనిచేసిన కామరాజ్ ఒక నిరక్షరాస్యుడు. అయినప్పటికీ, ఎంతో చురుకైన రాజకీయ నాయకులను తన క్యాబినెట్లోకి తీసుకొని ప్రాధాన్యం ఉన్న శాఖలను, అధికారాలను ఇచ్చారు. ఆయనకు అభద్రత ఉండేది కాదు. అందుకే ప్రజలు ఇప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకొంటున్నారు.
–బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి