కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మరో రెండు నెలలు మాత్రమే గడువు ఉండటంతో పశ్చిమబెంగాల్లో ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి మమతాబెనర్జి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జి తీరికలేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండగా.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పంచ్పోటా ఏరియాలో ఆమె రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో భాగంగా ఆమె మధ్యలో ఒకసారి జీపు దిగి స్కూటీ ఎక్కారు. స్వయంగా తనే స్కూటీ నడుపుతూ రోడ్ షోలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు.