హైదరాబాద్ : పశు సంవర్ధక శాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా ప్రశంసించారు. ఈ మేరకు సోమవారం ఆయన వివిధ రాష్ట్రాల పశు సంవర్ధక శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పశు సంవర్ధక శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఆయా కుల వృత్తులకు జీవం పోసేలా గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీని చేపట్టినట్లు పేర్కొన్నారు. పశువుల కోసం 100 సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్కేవీవై పథకం కింద రంగారెడ్డి జిల్లా కరకపట్లలో టీకా ఉత్పత్తి కేంద్రం నిర్మించడం కోసం కేంద్ర ఆమోదించిన రూ.75 కోట్లతో పాటు వివిధ కార్యక్రమాలకు ఆమోదించిన రూ.29 కోట్ల నిధులను త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అదే విధంగా ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రం నిర్మాణం దాదాపు పూర్తయిందని, మరో రూ.10 కోట్లు విడుదల చేస్తే వీర్యం ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని తెలిపారు. అదే విధంగా మరో 100 పశు సంచార వైద్యశాల వాహనాలను మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు రెండు పశు వైద్య కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.