న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు సంధించారు. సర్కారు సకాలంలో స్పందించడం లేదని, అదే పెద్ద సమస్యగా తయారైందని ధ్వజమెత్తారు. బీజేపీ వ్యవస్థాపకులను గుర్తు చేసుకుంటూ వారి కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందంటూ సీనియర్ల ప్రాధాన్యాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ఆదివారం ఆయన ముంబైలో జరిగిన నాట్కాన్ సదస్సులో, అనంతరం నాగపూర్లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీలో దుమారం చెలరేగుతున్నది. ఇటీవలే పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసనకు గురైన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన పాలన గురించి చెప్పుకొన్న గొప్పలకు భిన్నంగా ఉండటం విశేషం. ఇదొక స్వర్ణయుగం అంటూ మోదీ తన సర్కారు విజయాలను ఏకరువు పెట్టారు. కానీ గడ్కరీ ఆ మాటల గాలితీశారు. ‘భారత్లో మౌలిక సదుపాయాల రంగం భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉన్నది. దీంట్లో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. దానికి అవసరమైన శక్తి కూడామన దగ్గర ఉన్నది. ఉన్నత సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నిటికీ మించి సమయమే అతిపెద్ద పెట్టుబడి.. సాంకేతికత లేదా వనరుల కన్నా సమయమే చాలా ముఖ్యం. టెక్నాలజీ, వనరులతో పోలిస్తే సమయానుగుణంగా తీసుకునే నిర్ణయాలే ప్రధానం.
అయితే, ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. అదే అతి పెద్ద సమస్య’ అంటూ గడ్కరీ తన పార్టీ సర్కారుకే గడ్డిపెట్టారు. గడ్కరీ అంతటి గొప్ప నాయకుడే ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో బీజేపీ నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. ఆయన వ్యాఖ్యలు సాధారణ రీత్యా చేసిన సూచనలే తప్ప మరేమీ కావని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ముంబైలో సంచలన వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. కొన్ని గంటలకే నాగపూర్లో మాట్లాడుతూ అటల్ బీహారీ వాజపేయి, లాల్కృష్ణ అద్వానీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ వంటి నేతల కృషి వల్లే బీజేపీ ప్రస్తుత ఉన్నత స్థితికి చేరుకొన్నదని అన్నారు. ‘చీకట్లు తొలగిపోతాయి.. సూర్యుడు ఉదయిస్తాడుకమలం వికసిస్తుంది’ అంటూ 1980లో బీజేపీ నిర్వహించిన సదస్సులో అటల్జీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ‘ఆ రోజు సభలో నేనున్నాను. ఆ ప్రసంగాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు వస్తుందని నమ్మారు.
అటల్జీ, అద్వానీజీ, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి ఎందరో నేతల కృషి వల్లే మనం ఈరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో సర్కారు ఏర్పాటు చేయగలిగాం’ అని పేర్కొన్న గడ్కరీ.. వారి కృషి వల్లే ప్రస్తుత నాయకత్వం అధికారాన్ని అనుభవిస్తున్నదని పరోక్షంగా మొట్టికాయలు వేశారన్న చర్చ జరుగుతున్నది. గడ్కరీ ఇలా సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ‘ఈ రోజుల్లో రాజకీయం అంటే అధికారపు వెంపర్లాటగా తయారైంది.. నాకైతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తున్నది’ అంటూ ఇటీవల నాగపూర్లో చేసిన ప్రసంగంలో నిర్వేదం వ్యక్తం చేశారు. ఆ నిర్వేదం సొంతపార్టీ నడుపుతున్న సర్కారు మీదనే అనేది సుస్పష్టమే. రెండు సందర్భాల్లోనూ వేదిక నాగపూర్ కావడం గమనార్హం. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నాగపూర్లో ఉంటుంది. పైగా ఆర్ఎస్ఎస్కు ప్రధాని మోదీ కన్నా గడ్కరీ సన్నిహితుడని అంటారు. తన మాటల ద్వారా ఆయన నాగపూర్ పెద్దలకు ఏదైనా సందేశం ఇస్తున్నారా? ప్రస్తుత కేంద్ర నాయకత్వంపై తన అసంతృప్తిని, అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారా? అని విశ్లేషకుల్లో చర్చలు నడుస్తున్నాయి.