ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి బీఎల్ వర్మకు ప్రజల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతున్నది. వివిధ వర్గాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు ప్రశ్నించగా మాట దాటవేశారు. శనివారం వరికి గిట్టుబాటు ధర, రుణమాఫీపై రైతులు నిలదీయగా ముఖం చాటేశారు.
జనగామ, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్రం నుంచి పింఛన్లు ఇస్తమంటిరి.. ఇప్పటిదాక ఒక్క ఇల్లు కట్టియ్యకపోతిరి.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటిరి.. మా పిల్లలు పనిలేక ఉత్తగనే ఉంటున్నరు సారూ’ అంటూ జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్లో కేంద్ర మంత్రి బీఎల్ వర్మను స్థానిక మహిళలు నిలదీశారు. సమాధానం చెప్పలేక మంత్రి అక్కడినుంచి జారుకొన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండో రోజైన శనివారం స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించి రైతులు, మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.
తొలుత చిల్పూర్ మండలం నష్కల్లో రైతులు, మహిళలతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించి కేంద్రం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. ‘వరికి గిట్టుబాటు ధర కల్పించాలి.. కేంద్రం నుంచి వ్యవసాయానికి సబ్సిడీపై ఎరువులు.. పరికరాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు రైతు రుణం మాఫీ చేస్తున్నది. కేంద్రం కూడా మరో రూ.2 లక్షలు మాఫీ చేస్తే అన్నదాతకు మరింత ఆసరా అవుతుంది’ అని రైతులు కుండబద్దలు కొట్టారు. కేంద్రం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం రూ.6 వేలు (మూడు సార్లు కలిపి) అందరికీ సరిగా అందడం లేదన్నారు. పంటలకు బీమా పథకం అమలు చేయాలని కోరగా కేంద్ర మంత్రి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడినుంచి మెల్లగా జారుకొన్నారు. మధ్యాహ్న భోజనం కోసం పల్లగుట్టలోని బీసీ నేత శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన మంత్రి.. బయటి నుంచి తెప్పించిన చపాతీలను ఆరగించారు. రైతులు, ఉజ్వల యోజన లబ్ధిదారులతో చేపట్టిన సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెంట వచ్చిన బీజేపీ మార్బలం తప్ప అసలైన రైతులు, మహిళలు పెద్దగా రాకపోవడం గమనార్హం.
నష్కల్, పల్లగుట్టలో పర్యటించిన మంత్రి స్టేషన్ఘన్పూర్లో మీడియా సమావేశంలో మాట్లాడి, రఘునాథపల్లిలో ఉజ్వల యోజన లబ్ధిదారులతో ముఖాముఖి కావాల్సి ఉన్నా రైతులు, మహిళలు నిలదీస్తుండటంతో వెనక్కి తగ్గారు. చీకటి పడుతున్నది.. ఫ్లైట్కు టైం అయ్యిందంటూ మధ్యాహ్నం 3 గంటలకే హైదరాబాద్కు వెళ్లిపోయారు.