ఐక్యరాజ్యసమితి: ఇటీవల ఇజ్రాయెల్, పాలస్తీనా భీకరంగా క్షిపణులతో హోరాహోరీగా పోరాడిన సంగతి తెలిసిందే. గాజాలోని పాలస్తీనా శిబిరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా, పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై శరపరంపరగా రాకెట్లు వేసింది. ఇరుపక్షాలకూ నష్టం జరిగింది. అనేకమంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మీడియా భవనం ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలింది. చివరకు ఇరుపక్షాలూ పరస్పర అంగీకారానికి వచ్చి మే 21న కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ యుద్ధంలో మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్ యుద్ధనేరాలపై బహిరంగ దర్యాప్తు చేపట్టడంపై గురువారం ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంస్థ (యూఎన్హెచ్చార్సీ) ముందు ఓ తీర్మానం వచ్చింది. హమాస్తో పాటు ఇజ్రాయెల్ ఉల్లంఘనలపై దర్యాప్తు చేయాలని ప్రతిపాదించే తీర్మానంపై వోటింగ్ ను భారత్తో సహా 13 దేశాలు బహిష్కరించాయి. ఇందులో ఫ్రాన్స్, ఇటలీ, నేపాల్, జపాన్ ఉన్నాయి. అయినప్పటికీ 47 మంది సభ్యులు గల మండలిలో ఈ తీర్మానం 27 ఓట్లతో నెగ్గింది. పాకిస్థాన్, చైనా, బాంగ్లాదేశ్, రష్యా, మెక్సికో, సూడాన్ దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. కాగా జర్మనీ, యూకే తదితర దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇటు ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదని, అలాగే హమాస్ విచ్చలవిడిగా రాకెట్ దాడులు జరపడం అంతచర్జాతీయ మానవ హక్కులకు భంగకరమని తీర్మానంపై చర్చట సందర్భంగా మండలి చైర్మన్ మిషెలీ బాషలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయెల్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. తీర్మానం అమలులో సహకరించబోమని ప్రదాని నెతన్యాహూ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పాలస్తీనా విదేశాంగ శాఖ మాత్రం తీర్మానాన్ని ప్రశంసించింది. జవాబుదారీతనం, చట్టాన్ని అమలు చేయడం, పాలస్తీనా ప్రజల హక్కులు కాపాడడంపై అంతర్జాతీయ సమాజం అంకితభావం ఈ తీర్మానంలో కనిపిస్తున్నదని పేర్కొన్నది.