న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్నది. ఆగస్టులో ఏడాది వ్యవధిలో గరిష్ఠంగా 8.3 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. గత నెలలో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ)వెల్లడించింది. జూలైలో 6.8%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఆగస్టులో 8.3 శాతానికి పెరిగిందని పేర్కొన్నది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.6 శాతానికి పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 7.7 శాతానికి (జూలైలో 6.1%) చేరింది. బీజేపీ పాలిత హర్యానాలో నిరుద్యోగిత రేటు అధికంగా 37.3 శాతం ఉండగా, తరువాతి స్థానాల్లో కశ్మీర్(32.8%), రాజస్థాన్ (31.4%) ఉన్నాయి. దేశంలో అస్థిర వర్షపాతం సాగు కార్యకలాపాలపై ప్రభావం చూపిందని, తద్వారా నిరుద్యోగం పెరిగిందని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ పేర్కొన్నారు.
ఎన్నేండ్లు వేచిచూడాలి: వరుణ్గాంధీ
నిరుద్యోగ అంశంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సొంత పార్టీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. సీఎంఐఈ తాజా నివేదికను ప్రస్తావిస్తూ.. యువకుల్లో ఉద్యోగిత రేటు ఐదేండ్ల కనిష్టానికి చేరిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. 2017లో 20.9 శాతంగా ఉన్న ఉద్యోగిత రేటు ప్రస్తుతం 10.4 శాతానికి పడిపోయిందని అన్నారు. ఉద్యోగాల కోసం దేశ యువత ఎన్నేండ్లు వేచిచూడాలని ప్రశ్నించారు. 10 లక్షల ఖాళీల భర్తీ చేపట్టాలని ప్రధాని మోదీ ఇటీవల ప్రభుత్వ శాఖను కోరారని, అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.