హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల ఫాసిస్టు చర్యలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో భావ ప్రకటన స్చేచ్ఛతోపాటు అనేక హకులను కోల్పోయే ప్రమాదం ఉన్నదని పలువురు మేధావులు హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని అడ్డుకొనేందుకు ఐక్యకార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘దేశంలో పరిణామాలు- మేధావుల విశ్లేషణ’ అన్న అంశంపై శుక్రవారం హైదరాబాద్ మగ్ధుం భవన్లో సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. మతోన్మాదశక్తుల ఏలుబడిలో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
చివరకు ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఏమి ఆలోచించాలో కూడా వారు నిర్ణయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో మార్పు కోసం రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలు ఐక్య పోరాటం చేస్తూ కేంద్రంపై ముప్పేట దాడి చేయాలని, ఈ పోరులో వామపక్షాలు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సంపాదకులు కే శ్రీనివాస్, కే శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఫాసిస్ట్ చర్యలను ఎదుర్కోడానికి ఇదే చివరి అవకాశమని, దీన్ని ఉపయోగించుకోకపోతే ఈ కాలం ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతుందని హెచ్చరించారు. నోట్ల రద్దు నల్లధనం కోసమేనని, వారందరూ బ్యాం కుల వద్ద నిలబడతారనే భ్రమలు కల్పించారని.. పెట్రో ధరలు పెరిగి జేబులకు చిల్లులు పడుతున్నా దేశం కోసమేనని నమ్మించే పరిస్థితులను సృష్టించారని చెప్పారు.
కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ప్రధాన పత్రికలు, టీవీల్లో ఒక్క కథనం కూడా రావడం లేదన్నారు. పండుగల పేరుతో ఆధిపత్య మత భావజాలం విస్తరిస్తున్నదని ప్రొఫెసర్ ఖాసిం అభిప్రాయ పడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ మార్క్సిజాన్ని మించిన సత్య సిద్ధాంతం మరోటి లేదన్నారు. సంస్కృతి పేరుతో బీజేపీ ప్రజలను దోపిడీ చేసే సంస్కృతిని తీసుకొచ్చిందని ప్రజా గాయకుడు గద్దర్ అనగా, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని మల్లేపల్లి లక్ష్మయ్య విమర్శించారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పాపారావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, అజీజ్పాషా, పల్లా వెంకట్రెడ్డి, ప్రతినిధులు పశ్య పద్మ, బాలమల్లేశ్, రాపోలు సుదర్శన్, కేవీఎల్ తదితరులు పాల్గొన్నారు.