గురుగ్రామ్: నిర్మాణంలోని వంతెన భాగం కూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్-ద్వారకా ఎక్స్ప్రెస్వేపై నిర్మిస్తున్న వంతెనలోని ఒక భాగం, దానికి సపోర్టుగా ఉన్న భారీ యంత్రం కూలిపోయింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు దౌలతాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ సుమారు ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, గురుగ్రామ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ ఇటీవల ఈ ప్రాజెక్టును సందర్శించారు. వంతెన నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సూచించారు.