హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): వృథాగా సముద్రం పాలయ్యే నదీ జలాలను తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న ప్రాంతాలకు మళ్లించి సస్యశ్యామం చేయాలన్నదే నదులు అనుసంధాన ప్రాజెక్టు లక్ష్యం. ఆశయం గొప్పదే అయినా పకడ్బందీ ప్రణాళికలు, స్పష్టత, తగిన శాస్త్రీయ అధ్యయనాలు లేకుండా దీనిపై ముందుకు వెళితే ఎలాంటి ఫలితాలు సాధించే అవకాశాలు ఉండవని అనేక రాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక నదుల జలాల పంపకం విషయంలో ఇప్పటికీ ఇరుగుపొరుగు రాష్ర్టాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. నిప్పులను ఆర్పే శక్తి ఉన్న నీళ్లు.. మంటలను రాజేస్తున్నాయి. అసలు నదీ జలాలాల్లో వాటాలు తేల్చకుండా నదులను అనుసంధానం చేయడమేంటన్న ప్రాథమిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక నదిని మరో నదితో అనుసంధానం చేయాలంటే ముందుగా వాటిలో మిగులు ఎంతో తేలాలి. సదరు రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాత మిగిలే జలాలను వేరే నదికి తరలించేందుకు అభ్యంతరాలు ఉండవు. కానీ.. కేంద్రం ఈ విషయంలో దోబూచులాటలాడుతున్నది. మిగులు చూపించకుండానే ఇతర బేసిన్లకు నీటిని ధారాదత్తం చేయాలనుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో మిగులు జలాల్లేవని అభ్యంతరాలు చెప్తున్న కేంద్రం.. మరి మిగులు జలాలు ఉంటే ప్రాజెక్టులకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నదీ జలాల విషయంలో కేంద్రానికి ఒక స్పష్టత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
అడ్డదిడ్డంగా గోదావరి-కావేరి లింక్
గోదావరి-కృష్ణా- పెన్నా- కావేరి ప్రాజెక్టును కేంద్రం అడ్డదిడ్డంగా రూపొందించిందని నీటిరంగ నిపుణులు అంటున్నారు. వాస్తవంగా ఆ ప్రాజెక్టులో భాగంగా మొత్తంగా మహానది నుంచి 234 టీఎంసీలు, గోదావరి నుంచి 324 టీఎంసీలను మళ్లించాలని తొలుత ప్రణాళికలను రూపొందించారు. అయితే మిగులు జలాల తరలింపునకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఒడిశా స్పష్టం చేయడంతో ప్రాజెక్టును తొలుత గోదావరి నుంచి చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇక గోదావరి మిగులు నీటి లెక్కల్లోనూ అనేక అస్పష్టతలు ఉన్నాయి. 1989 వాటర్ బ్యాలెన్స్ స్టడీ ప్రకారం ఇచ్చంపల్లి వద్ద 718 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని ఎన్డబ్ల్యూఏ చెప్తున్నది. 2004-05 అధ్యయనం సైతం ఇవే లెక్కలు చెప్పింది. 2015లో ఎన్డబ్ల్యూడీఏ నివేదిక మాత్రం ఎస్సారెస్పీ నుంచి ఇచ్చంపల్లి వరకు 177టీఎంసీలు, ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీలు మొత్తంగా 324 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని తేల్చింది. ఎన్డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలను తెలంగాణతోపాటు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు సైతం కొట్టిపారేశాయి. మిగులు జలాలు ఉండబోవని స్పష్టం చేశాయి. అయినప్పటికీ నీటిలభ్యతపై ఎలాంటి అధ్యయనం చేయించకుండా కేంద్రం మరో ఎత్తుగడ వేసింది. ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీలను తొలిదశలో కావేరికి మళ్లిస్తామని తాజాగా మరో ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఇలా ఇష్టారాజ్యంగా కేంద్రం ఎప్పటికప్పుడు ఏకపక్షంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం, వాటిని రాష్ర్టాలు వ్యతిరేకించడం పరిపాటిగా మారిపోయింది.
నేడు కీలక సమావేశం..
గోదావరి-కృష్ణా- కావేరి-పెన్నా నదుల అనుసంధానంపై మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ నేతృత్వంలో రివర్ బేసిన్లోని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రల ప్రతినిధులు హాజరు కానున్నారు. గోదావరిలో నీటి లభ్యతతోపాటు, తుపాకులగూడెం బరాజ్ నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలనే అంశంపై ప్రధానంగా ఆయా రాష్ర్టాలతో చర్చించనున్నారు.