రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రజలు నిత్యం బాంబు శబ్దాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. పలవురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసపోతున్నారు. కాగా, తమ బాధను వ్యక్తపరిచేందుకు ఉక్రెయిన్ విద్యార్థులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. రష్యా బాంబు దాడుల్లో శిథిలమైన భవనాల వద్ద గ్రాడ్యుయేషన్ ఫొటోషూట్ చేశారు.
రష్యా బాంబు దాడుల్లో చెర్నిహివ్ పట్టణంలోని చాలా భవనాలు శిథిలమైపోయాయి. చెర్నిహివ్ రూపురేఖలు మారిపోయాయి. కాగా, కొంతమంది హై స్కూల్ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ డే ద్వారా తమ బాధను ప్రపంచానికి చూపాలనుకున్నారు. ఈ శిథిల భవనాల సాక్షిగా తమ గ్రాడ్యుయేషన్ డే ఫొటో షూట్ చేశారు. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నిహివ్లో 40 మంది విద్యార్థుల చాలా ముఖ్యమైన స్టోరీని డాక్యుమెంట్ చేస్తున్నట్లు ఫొటోగ్రాఫర్ స్టానిస్లావ్ సెనిక్ చెప్పారు. మరో 10-15 ఏళ్లలో వీళ్లందరికీ పిల్లలు పుడుతారని, తాము అనుభవించిన బాధను ఈ ఫొటోల ద్వారా వాళ్లకు తెలియజేస్తారన్నారు.
ఒక ఫొటోలో విద్యార్థులు యుద్ధ ట్యాంక్పైన నిల్చున్నారు. తమ చాతీపై గ్రాడ్యుయేషన్ బ్యాడ్జీలు వేలాడుతుండగా విషణ్న వదనంతో చూస్తుండిపోయారు. మరో ఫొటోలో కొంతమంది విద్యార్థినులు కూలిపోయిన భవనం వద్ద ఫోజులిచ్చారు. పై అంతస్థులో వారి స్నేహితులు కిందికి చూస్తూ కనిపించారు.
తాము ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నామని ఓల్హా బేబినెట్స్ అనే అమ్మాయి తెలిపింది. ఈ పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్ డే చేసుకోవడం చాలా బాధాకరమైనప్పటికీ..మా పెయిన్ అందరికీ తెలియాలనే కలిసికట్టుగా ఫొటోషూట్లో పాల్గొన్నట్లు చెప్పింది. ఈ ఫొటోలను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తామని, వాటిని అమ్మి ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న సైనికులకు ఇస్తామని తెలిపింది.