ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి మృతి చెందాడు. అప్పటి నుంచి భారతీయ విద్యార్థులను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి, భారతీయులను స్వదేశానికి పంపే ఏర్పాట్లు పర్యవేక్షించారు. దీనికి ‘ఆపరేషన్ గంగ’ అని ప్రభుత్వం పేరు పెట్టింది. అయితే ఇంకా చాలా మంది విద్యార్థులకు భారత ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని, తినడానికి ఏమీ లేక రోజు మొత్తం మూడు చెంచాల అన్నంతో బతకాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా వాపోయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మరికొందరు భారతీయ విద్యార్థులు ఇలాంటిదే ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘మాకు చాలా భయంగా ఉంది. చాలా కాలం ఎదురు చూశాం. ఇక మా వల్ల కాదు. ఇక్కడ ప్రాణాలకు చాలా ముప్పు ఉంది. సరిహద్దుల వైపు వెళ్లడానికి కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి’’ అని తమ పరిస్థితిని వివరించారు.
అక్కడితో ఆగకుండా ‘‘మాకు ఏమైనా జరిగితే.. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ పూర్తిగా విఫలమైనట్లే. అతిపెద్ద ఫెయిల్యూర్గా మిగిలిపోతుంది’’ అని చెప్పారు. ఇదే తాము చేసే ఆఖరి విన్నపం, ఆఖరి వీడియో అని వాళ్లు పేర్కొన్నారు.
In the video, a student of Sumy State University says, “We are afraid, we have awaited a lot and we cannot wait anymore. We are risking our life; we are moving towards the border. If anything happens to us, all the responsibility will be for government and Indian Embassy.” pic.twitter.com/q1NnK2BCdk
— The Indian Express (@IndianExpress) March 5, 2022