లండన్ : సంపన్నులపై పన్నుల భారం తగ్గిస్తానని హామీ ఇచ్చి బ్రిటన్ ప్రధాని పీఠమెక్కిన లిజ్ ట్రస్.. నెల రోజులు తిరక్కముందే యూ టర్న్ తీసుకున్నారు. సంపన్నులపై పన్నులను తగ్గించనున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగించడం లేదని ఆ దేశ ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్ ట్వీట్ చేశారు. పాలక కన్జర్వేటీవ్ పార్టీ వార్షిక సదస్సులో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగినట్లుగా తెలుస్తున్నది. విపక్ష లేబర్ పార్టీతో పాటు సొంతపార్టీ కూడా ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం.
బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేందుకు లిజ్ ట్రస్.. సంపన్నులపై పన్నుల భారాన్ని ఎన్నికల హామీగా ఎంచుకున్నది. ఇదే అంశంతో కన్జర్వేటీవ్ పార్టీలో ప్రధాన ప్రత్యర్థి అయి రిషి సునాక్పై పైచేయి సాధించి ప్రధాని పీఠం అధిష్టించారు. ఆ తర్వాత గత నెల 23 న కొత్త వృద్ధి ప్రణాళికను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పాలసీగా సంపన్నులపై పన్నుల భారాన్ని 45 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్థిక మార్కెట్లో గందరగోళం నెలకొన్నది. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల జరిగిన అధికార కన్జర్వేటీవ్ పార్టీ వార్షిక సదస్సు రెండో రోజు సమావేశంలో ఈ చర్యపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. చివరకు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని లిజ్ ట్రస్పై ఒత్తిడి తీసుకొచ్చారు.
కొంత పశ్చాత్తాపం అనంతరం టాప్ రేట్ పన్ను తగ్గింపును రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్ ట్వీట్ చేశారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ తీసుకొచ్చిన తొలి పాలసీ విషయంలో యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ప్రభుత్వంపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లి మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మినీ బడ్జెట్గా పిలువబడేది రికార్డు డాలర్ కనిష్ట స్థాయికి పౌండ్ పతనమైంది. ఒకవైపు జీవన వ్యయ సంక్షోభం ఎదుర్కొంటుండగా.. మరోవైపు ఈ పాలసీ తీసుకురావడం పట్ల బ్రిటన్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాలసీ తీసుకొచ్చిన 10 రోజుల వ్యవధిలోనే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం తన ఆర్థిక విశ్వసనీయతను నాశనం చేసిందని, ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసిందని బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.