న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా యుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఇరువురు నిర్ణయించారు. అలాగే రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంలో పౌరుల మరణాలను ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. కాగా, దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్మోదీ అప్పగింతపై బోరిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని భారత్కు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొన్ని న్యాయపరమైన అంశాల కారణంగా అప్పగింత క్లిష్టతరంగా మారిందని పేర్కొన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు భారత్లో విచారణ ఎదుర్కోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ, మాస్కోపై పశ్చిమదేశాల ఆంక్షల విషయంలో భారత్పై బ్రిటన్ ఎలాంటి ఒత్తిడి తేలేదని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.