ఏరోనాటికల్ వర్సిటీలో భాగస్వామ్యానికి క్రాన్ఫీల్డ్ రెడీ
నైపుణ్యశిక్షణ సంస్థతో కలిసి పనిచేస్తామన్న పియర్సన్ సంస్థ
హైదరాబాద్లో విస్తరణకు హెచ్ఎస్బీసీ, జీఎస్కే ముందుకు..
ఐటీ మంత్రి కేటీఆర్తో వరుస సమావేశాల్లో ప్రతినిధుల వెల్లడి
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు 2వ రోజూ లండన్లోని పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను, పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రత్యేక పాలసీలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి తెలిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలుంటాయని కేటీఆర్ భరోసా కల్పించడంతో.. ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబర్చాయి. విద్య, నైపుణ్య శిక్షణకు చెందిన సంస్థలు ఇక్కడి సంస్థలతో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చాయి.
యూకే పర్యటనలో రెండోరోజు..
హైదరాబాద్లో మరింత విస్తరిస్తాం: జీఎస్కే
హైదరాబాద్ ఫార్మాలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్కె్లైన్ (జీఎస్కే) రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెడ్ ఫ్రాంక్ రాయట్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. విస్తరణ ప్రణాళికలతోపాటు హైదరాబాద్లో ఉన్న తమ విభాగాల పురోగతిని ఆయన కేటీఆర్కు వివరించారు. తమ సంస్థ వ్యూహా ల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. హైదరాబాద్లో రూ.710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని, 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. గత రెండేండ్లలో రూ.340 కోట్లు హైదరాబాద్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపారు.
ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు
లండన్ కింగ్స్ కాలేజీతోఎంవోయూ
ప్రతిష్ఠాత్మక లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ కలిసి పనిచేయనున్నది. గురువారం లండన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, కింగ్స్ కాలేజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింగ్స్ హెల్త్ పార్ట్నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. గత నెలలో బ్రిటిష్ కౌన్సిల్ నేతృత్వంలో కింగ్స్ కాలేజీ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్తో సహా ప్రతినిధులు భారతదేశంలో పర్యటించారు. దానికి కొనసాగింపుగా గురువారం కింగ్స్ కాలేజ్ క్యాంపస్ను మంత్రి కేటీఆర్ సందర్శించారు.
తాజా ఒప్పందంతో ఫార్మా రంగ ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతోపాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజీ సహకరిస్తుంది. ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ విజన్కు కింగ్స్ కాలేజీ తోడ్పాటును ఇస్తుంది. కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శితిజ్ కపూర్ మాట్లాడుతూ టెక్నాలజీ, హెల్త్కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. తమ యూనివర్సిటీ ఇప్పటికే ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్తో కలిసి ఆంథ్రోపాలజికల్ రిసెర్చ్ స్టడీ నిర్వహిస్తున్నదన్నారు. ఈ ఒప్పందం యూకే, ఇండియా సంబంధాల్లో మైలురాయి లాంటిదని యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చాంపియన్ సర్ స్టీవ్స్మిత్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా మారబోతున్నదని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం తమ ఫార్మా సిటీ విజన్లో భాగమని చెప్పారు. తెలంగాణ లైఫ్సైన్సెస్ ఎకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు.