శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
శనివారం తెల్లవారుజాము 3:00 గంటల నుంచి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అలంకార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
మధ్యాహ్నం ప్రదోశకాల సమయం మినహా అర్ధరాత్రి 12:00 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
స్వామి అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవం, ఏకాంత సేవ మినహా నిత్యం జరిగే ఆర్జిత ప్రత్యక్ష, పరోక్ష హోమాభిషేకాలు నిలిపివేయనున్నారు.
యాత్రికులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, పార్కింగ్, శానిటేషన్, తాగునీటి సరఫరా, అన్నప్రసాద వితరణ శిబిరాల వద్ద వసతులను పర్యవేక్షిస్తున్నట్లు ఈఈ మురళీ బాలకృష్ణ తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వస్తున్న భక్తులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్న భక్తులకు దేవస్థానం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ చేస్తున్నది.
తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన సేవా సంఘాలు సైతం ఇందుకు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి.
ఉగాది మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యహవచనం, చండీశ్వరపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తుపూజ, హోమం, మండపారాధన, కళశస్థాపన, రుద్రహోమం, రుద్రపారాయణలతోపాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణ ప్రత్యేక పూజలు, చండీహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
సాయంత్రం అంకురార్పణ, జపానుష్టాన ప్రత్యేక పూజల అనంతరం అలంకార మండపంలో భృంగి వాహనంపై ఆశీనులైన ఆదిదంపతులకు షోడశోపచార క్రతువులు నిర్వహిస్తారు.
అనంతరం గ్రామోత్సవంలో మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి