ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన, రెబల్ వర్గాలు పోటాపోటీగా దసరా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. శివసేన ఏర్పడిన 56 ఏళ్ల తర్వాత ఆ పార్టీ రెండుగా చీలి దసరా వేడుకలను వేర్వేరుగా నిర్వహించడం ఇదే తొలిసారి. బీజేపీ మద్దతులో సీఎం పదవిని చేపట్టిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గం ముంబై శివారులోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వద్ద ఎంఎంఆర్డీఏ గ్రౌండ్లో బుధవారం దసరా వేడుకలు నిర్వహిస్తున్నది. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన బాంబే హైకోర్టు ఆదేశాలతో బాంద్రాలోని చారిత్రక శివాజీ పార్కులో దసరా సభ ఏర్పాటు చేసింది. శివసేన ఏర్పడిన 1966 నుంచి ప్రతిఏటా దసరా వేడుకలను ఈ పార్కులోనే ఆ పార్టీ నిర్వహిస్తున్నది.
కాగా, పోటాపోటీగా దసరా సభల నేపథ్యంలో ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన మహిళలు, కొందరు వ్యక్తులు నాసిక్ నుంచి ముంబైకి బస్సులో వెళ్తున్నారు. అయితే షిండే వర్గం మద్దతుదారులు ఒక వాహనంలో వెళ్తూ ఉద్ధవ్ శివసేనకు చెందిన మహిళల పట్ల అభ్యంతరకరంగా సైగలు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, ఇతర శివసేన కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న రెబల్ వర్గం వారిపై దాడి చేశారు.