హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. వరధ ఉధృతికి సింధూజ (21) అనే యువతితో పాటు బిందు (14) అనే బాలిక వాగులో కొట్టుకుపోయారు. ఇటుకాలపల్లి నుంచి కుర్రారం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వాగు వద్దకు చేరుకొని గల్లంతైన వారి సింధూజ, బిందు కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8 గంటల వరకు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ఆలేరులో 194 మిల్లీ మీటర్లు, రాజపేట మండలంలో 156 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.