అమ్మ… ఆ రెండక్షరాలూ మనిషి జీవితానికి కొండంత అండనిస్తాయి. ఇక, యుక్తవయసు ఆడపిల్లలకు అమ్మ అవసరం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం. ఆడపిల్లలను కన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఓ అమ్మను కుటుంబసభ్యులే నిలువునా కాల్చేశారు. కండ్లముందే మంటల్లో కాలిపోతున్న తల్లిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన ఆ ఇద్దరు అమ్మాయిలు దానికి కారణమైన వాళ్లను కటకటాలపాలు చేసిందాకా నిద్రపోలేదు. బెదిరింపులూ, వేధింపులూ, ఎదురు కేసులూ ఏవీ వాళ్ల న్యాయ పోరాటాన్ని ఆపలేకపోయాయి. తల్లిని చంపిన తండ్రికి శిక్షపడే దాకా అలుపెరగని పోరాటం చేసిన ఆ అక్కాచెల్లెళ్లే ఉత్తర్ప్రదేశ్కు చెందిన లతిక ( Latika ), తాన్య ( Tanya ).
ఆడపిల్ల పుడితే ఆమె తప్పే. మళ్లీ మళ్లీ ఆడపిల్లలే కడుపున పడుతున్నారని 33 ఏండ్ల అనూకు ఆరుసార్లు అబార్షన్లు చేయించారు. అయినాసరే ఆమె మగబిడ్డకు జన్మను ఇవ్వలేకపోతున్నదని రోజూ చావ బాదేవాడు ఆమె భర్త మనోజ్ బన్సల్. తాగుడుకు బానిసైన అతను ఆమెను హింసించడం తప్ప మరే పనీ చేసేవాడు కాదు. అనూ మాత్రం తన ఇద్దరు బిడ్డలనూ చదివించుకోవాలని మిషన్కుట్టి డబ్బులు సంపాదించేది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో వీళ్లు నివాసం ఉండేవాళ్లు. తన కుటుంబాన్నీ, పిల్లలనూ కాపాడుకోవడం కోసం అనూ చూపించిన సహనం ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయింది.
2016 జూన్ 13, మనోజ్ ఇంటికి బంధువులు వచ్చారు. మనోజ్ తల్లి, బంధువులంతా కలిసి అనూకు మగపిల్లలు పుట్టలేదని తిట్టడం మొదలుపెట్టారు. వారసుడి కోసం ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు. ఎన్నిసార్లు గర్భం దాల్చినా మగబిడ్డ కడుపులో పడట్లేదని అంతా ఆమె తప్పేనని ఈసడించుకునేవారు. అలాగే రాత్రయింది. అందరూ పడుకున్నారు. కానీ ఏదో గొడవ జరుగుతున్న శబ్దం తాన్యకు వినిపించి నిద్రలేచింది. ఇంటికి వచ్చిన బంధువులు తండ్రితో కలిసి తల్లిని కొడుతున్నారు. ఆమె బాధతో కేకలు వేస్తున్నది. ఆ గదికి గడియ పెట్టేసరికి ఆమె తల్లి దగ్గరికి వెళ్లలేకపోయింది. కాసేపటికి తల్లి మీద తండ్రే కిరోసిన్ పోశాడు. నాయనమ్మ అగ్గిపెట్టె అందించింది. తండ్రి నిప్పు పెట్టి కాల్చేశాడు. ఢిల్లీలో సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ఆమెను చేర్పించారు. 95 శాతం కాలిన గాయాలతో నరకం అనుభవించిన ఆమె వారం రోజుల తర్వాత మరణించింది. ఆ రోజునే ఆ అక్కాచెల్లెళ్లు తల్లీ, తండ్రీ లేనివాళ్లయ్యారు. తమ తల్లిని తండ్రి, ఇతర బంధువులు హత్య చేశారంటూ పిల్లలు ఇద్దరూ కేసు పెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు లతిక వయసు 15 ఏండ్లు, తాన్యకు 11 సంవత్సరాలు. కేసు కోర్టు విచారణకు వచ్చింది.
పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు సరిగ్గా దర్యాప్తు చేయలేదు. పైగా మనోజ్ను మాత్రమే ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ మిగతా ఏడుగురు బంధువులను తప్పించారు. నిందితులైన ఆ బంధువులను లతిక, తాన్య బెదిరించినట్లుగా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరు ఇంత దుర్మార్గంగా ఉంటే, ఇక ఆ బంధువులు ఇంకెంత దుర్మార్గంగా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల వేధింపులను తట్టుకుంటూ, వాళ్ల దాడుల నుంచి తప్పించుకుంటూ లతిక, తాన్య ధైర్యంగా నిలబడ్డారు. అమ్మను చంపి, ఆవేదనను ఆస్తిగా ఇచ్చిన తండ్రిని మాత్రం వదిలిపెట్టలేదు. పిల్లలు పెద్దవాళ్లపైన దాడికి ఎలా దిగారని అక్షింతలు వేస్తూ కోర్టు పోలీసులు పెట్టిన రెండు కేసులనూ కొట్టివేసి, వారికి ఊరటనిచ్చింది.
తల్లి హత్యను పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించారని కొన్నాండ్ల తర్వాత తెలుసుకున్నారు లతిక, తాన్య. ఈ స్థితిలో వాళ్లకు వ్యవస్థలపై విశ్వాసం పోయింది. ఇద్దరూ అప్పటి ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఎన్నో లేఖలు రాశారు. కానీ, ఎన్నడూ స్పందన రాలేదు. తన దుఃఖాన్నంతా అక్షరీకరించిన లేఖపై రక్తంతో సంతకం చేసి లతిక మరో లేఖ రాసింది. ఆ లేఖ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. దాంతో ముఖ్యమంత్రి అఖిలేశ్ వాళ్లిద్దరినీ పిలిచి ఐదులక్షల రూపాయల చెక్కును అందించారు. వాళ్ల చదువులు ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించారు. ఇదంతా జరిగిన తర్వాత పిల్లలు న్యాయవాది సంజయ్ శర్మను కలిసి తమ తండ్రికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని కోరారు. వాళ్ల కండ్లలో అమ్మ లేని బాధ.. తండ్రిని ఎలాగైనా జైలుకు పంపాలన్న కసి చూసిన ఆ న్యాయవాది ఆశ్చర్యపోయాడు. ఆ కేసును వాదించడానికి అక్కాచెల్లెళ్ల పట్టుదలే ఆ న్యాయవాదికి స్ఫూర్తినిచ్చింది. ఆయన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రాసిన డాక్టర్ను వెదికి పట్టుకున్నాడు. కేసును తిరగదోడి, పోలీసుల తప్పుల్ని కోర్టులో ఎండగట్టాడు. నేరస్తులందరినీ బోనులో నిలబెట్టాడు. మొదట్లో కోర్టు హాలులో మాట్లాడేందుకు భయపడ్డ అక్కాచెల్లెళ్లు తర్వాత ధైర్యంగా సాక్ష్యాలు చెప్పారు. ఆరేండ్ల సుదీర్ఘ పోరాటం ఫలించి మనోజ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు అనూ హత్యలో బంధువుల పాత్ర మీద విచారణ జరుగుతున్నది.
టీవీ సీరియళ్లలో కనిపించే ఇళ్లలాంటి ఇంట్లో ఉండాలని కలలుకన్న ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ ఇప్పుడు పెచ్చులూడిపోయిన ఇంట్లో దీనంగా బతుకుతున్నారు. దీపం లేని ఇంట్లో చీకటిపాలైన వాళ్ల జీవితంలో తండ్రి ఉన్నా లేన్నట్టే. ఏ దిక్కూ లేని లతిక, తాన్య ఒకరికొకరు తోడుగా జీవిస్తున్నారు. భయానికి లొంగిపోతే అమ్మ ఓడిపోతుందని వాళ్ల భయం. ఈ ఆరేండ్లలో ఓ పక్క తమపై నమోదైన కేసులతో పోలీసుల అరెస్టు భయం. మరో పక్క తండ్రి తరఫు బంధువుల బెదిరింపులు. అయినా వాళ్లు వెనుకడుగు వేయలేదు. అమ్మ ప్రేమో? అమ్మ మీది ప్రేమో!.. వాళ్లను ముందుకు నడిపించింది. ఇప్పుడు లతిక బీఎస్సీ చదువుతున్నది. తల్లి కోరిక నెరవేర్చాలని నీట్ పరీక్ష రాసింది. తాన్య ఇంటర్మీడియట్ చదువుతున్నది. ఇంజినీరింగ్ చదవాలని ఉన్నా, అమ్మ కోరిక మేరకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నది. గణితం అంటే ఇష్టమున్నా కష్టపడి జీవశాస్త్రం చదువుతున్నది. తను ఎప్పుడూ కడుపు నిండా తినకపోయినా, తమకు ఇష్టమైనవి చేసిపెట్టే అమ్మ కోసం ఈ పనిచేయడం ఏమంత కష్టం కాదు అంటారు వీళ్లిద్దరూ!
ఈ లైబ్రరీ మహిళల కోసమే.. ఇక్కడ దొరికే బుక్స్ అన్నీ ఆడవాళ్లు రాసినవే..”