మామడ, సెప్టెంబర్ 20 : అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మద్దిపడగ మల్లయ్య (64) ఓ రైతు అమర్చిన విద్యుత్ కంచె తగిలి మృతిచెందాడు. సోమవారం ఉదయం రోజూలాగే గొర్రెలను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
గొర్రెలు సాయంత్రానికి ఇంటికి వచ్చాయి. కానీ, మల్లయ్య రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం వెతుకుతుండగా, పంట చేనులో విగత జీవిగా కనిపించాడు. అదే గ్రామానికి చెందిన రైతు పారెడి చంద్రమౌళి, తన పంట రక్షణ కోసం చుట్టూ విద్యుత్ కంచెను అమర్చాడు. అది తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లయ్య భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీఐ రాంనరసింహారెడ్డి తెలిపారు.
మరో రైతు బలి..
అదే పొన్కల్ గ్రామానికి చెందిన ద్యాగల బొర్రన్న(55).. వ్యవసాయ పనుల కోసం వెళ్లి, విద్యుత్ కంచె తగిలి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రన్న పనుల కోసం పంట చేనుకు వెళ్లాడు. పనులు ముగించుకొని బర్రె కోసం గడ్డి కోస్తుండగా, సమీపంలో ఏర్పాటు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్ర కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, విగత జీవిగా కనిపించాడు. బొర్రన్నకు భార్య, కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.