హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాల నుంచి బీజేపీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు హాజరయ్యారు.
అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్న సమావేశాల్లో తొలిరోజు కేంద్ర హోంమంత్రి రాజకీయ తీర్మానం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక తీర్మానాలను ప్రవేశపెట్టారు.
సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు విజయవంతంగా 8 ఏండ్ల పాలన పూర్తిచేసుకొన్నందున పార్టీ శ్రేణులకు నడ్డా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. రెండురోజులపాటు జరిగే కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రంతో ముగియనున్నాయి. కార్యవర్గ సమావేశాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.