టోక్యో : ఒలింపిక్స్ పోటీల ప్రారంభానికి ముందు కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున క్రీడాకారులు మహమ్మారి బారినపడగా.. తాజాగా మరో 12 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఇందులో ఇద్దరు క్రీడాకారులు ఒలింపిక్స్ విలేజ్లో ఉన్నారని గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గురువారం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 87కు చేరింది. కొత్తగా వైరస్ బారినపడ్డ వారిలో యూకేకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ స్కీట్ షూటర్ అంబర్ హిల్ ఉండగా.. ఆమె మహిళల విభాగంలో స్కీట్ షూటింగ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. అంబర్ హిల్ 2016 రియో ఒలింపిక్స్ ఫైనలిస్ట్. అయితే, ఆమె వైరస్ బారినపడ్డట్లు బ్రిటిష్ ఒలింపిక్స్ అసోసియేషన్ ధ్రువీకరించింది. ఆమె స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో క్రీడాకారిణిని ఎంపిక చేయలేదని పేర్కొంది. చిలీకి చెందిన తైక్వాండో అథ్లెట్ వైరస్కు పాజిటివ్గా పరీక్షించడంతో పోటీల నుంచి తప్పుకోగా.. చిలీ ఒలింపిక్స్ కమిటీ బుధవారం ధ్రువీకరించింది.