తిరువనంతపురం : తల్లిని వేధింపులకు గురి చేస్తున్న ఓ 70 ఏండ్ల వ్యక్తిని ఇద్దరు అమ్మాయిలు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలోని అయిరామ్కొల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ కోయ(70) అనే వ్యక్తి.. తన ఇంట్లో ఉంటున్న మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె కూతుళ్లు అతన్నిఅడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను ఆగకుండా మరింత రెచ్చిపోయాడు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఆ ఇద్దరు అమ్మాయిలు మహమ్మద్ కోయను గొడ్డలితో నరికి చంపారు.
అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ తల్లిని వేధింపులకు గురి చేస్తున్నందునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇద్దరు బాలికలు అంగీకరించారు. ఈ క్రమంలో తల్లితో పాటు ఇద్దరు అమ్మాయిలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.