గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని టికమ్ఘర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ మీడియాకు తెలిపారు. గ్వాలియర్-ఝాన్సీ రహదారిపై ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను గ్వాలియర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతావారిని ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానానికి చేరవేసినట్లు వెల్లడించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో దాదాపు 100 మంది ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ నుండి టికమ్ఘర్కు కండక్టర్ ఒక్కో ప్రయాణికుడి నుండి రూ. 700 వసూలు చేసినట్లు చెప్పాడు. సోమవారం రాత్రి డ్రైవర్తో సహా బస్సు సిబ్బంది అందరూ భోజనం అనంతరం రాజస్థాన్లోని ధోల్పూర్ వద్ద మద్యం సేవించినట్లు తెలిపాడు. ధోల్పూర్ వద్దే బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టిందని, అనంతరం గ్వాలియర్ సమీపానికి చేరుకునే సరికి డ్రైవర్ వీల్పై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్లు పేర్కొన్నాడు.