జయశంకర్భూపాలపల్లి : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బుర్రి సడువలి, రజిత దంపతుల కుమారుడు అర్జున్ప్రసాద్(9), సుడిది రాంబాబు, భారతి దంపతుల కుమారుడు రాజ్కుమార్(10) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు, మూడో తరగతి చదువుతున్నారు. ఈ రెండు కుటుంబాలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.
తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉండగా బుధవారం మధ్యాహ్నం రాజ్కుమార్, అర్జున్ ప్రసాద్ తమ పొలం వద్దకు వెళ్లారు. అక్కడే ఆడుకుంటూ పక్కనే ఊర చెరువులో ఈతకొట్టడానికి నీటిలో దిగారు. చెరువులో ఉన్న గొయ్యిలో చిక్కుకుని మునిగిపోయారు.
అక్కడే పనులు చేస్తున్న ఓ అమ్మాయి గమనించి గ్రామస్తులకు సమాచారం అందించగా.. వారు వచ్చేలోపే నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. కేసు నమోదు చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ దవాఖానకు తరలించినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.