భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఇద్దరి దారుణహత్యకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత దమోహా జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హత్యలు జరిగిన జిల్లాలోనే రాష్ట్రపతి కోవింద్ ఆదివారం పర్యటించనున్నారు.
దమోహా జిల్లా కేంద్రంలో జబేరా ఎమ్మెల్యే ధర్మేంద్రసింగ్ లోధీ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తులు ఘనంగా జరుపుకున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైన గొడవ.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. మృతులను జోగేంద్రసింగ్, అరవింద్ జైన్గా గుర్తించారు. జోగేంద్రసింగ్ను తుపాకీతో కాల్చిచంపగా, అరవింద్జైను కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపర్చడం వల్ల చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. అరవింద్ జైన్ ఎమ్మెల్యే ప్రతినిధిగా పుట్టినరోజు వేడుకలకు హాజరుకాగా, జోగేంద్రసింగ్ అతిథిగా వచ్చారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఎమ్మెల్యే ధర్మేంద్రసింగ్ లోధీ అక్కడ లేరని పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. ఇలాఉండగా, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురవడం పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నదని కాంగ్రెస్ దమోహా జిల్లా అధ్యక్షుడు అజయ్ టండన్ విమర్శించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవాల్టి నుంచి రాష్ట్రపతి రెండు రోజులపాటు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా దమోహా జిల్లాలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు పర్యటిస్తారు. అక్కడి నుంచి సంగ్రామ్పూర్కు బయల్దేరి వెళ్లి అక్కడ మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న జన్జాతీయ సమ్మేళనాన్ని కోవింద్ ప్రారంభిస్తారు.