ఆంధ్రనగరిగా మధ్య యుగంలో పేరు గాంచిన ఓరుగల్లులో కాకతీయులు నిర్మించిన కోట ఎంతో ప్రత్యేకమైనది. ఈ కోటలోని కీర్తి తోరణాలు చారిత్రక అద్భుతాలు. ఎదుగుతున్న కాకతీయ బలానికి అనుమకొండ కంటే బలమైన కోట అవసరాన్ని గుర్తించిన రెండవ ప్రోల రాజు కొత్తగా కోట కట్టాలని అనుమకొండకు కొంత దూరంలో ఒక గుట్టను ఎంచుకున్నారట. అక్కడ ఆయన రథానికి పరసువేది శిల తగిలి రథం ఆగిపోయిందనీ, అందుకే ఆ ప్రాంతంలో శివాలయాన్ని కట్టించాడనీ ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ కథకు ఆధారాలు లేకపోయినా, ఓరుగల్లు కోట మాత్రం కాకతీయుల ఘనతకు చిహ్నంగా చరిత్రలో నిలిచింది.
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూరు వంటి ప్రాంతాలను, ఆంధ్రా లోని సముద్ర తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని ఏలిన కోట ఓరుగల్లు. ఒంటి కొండ మీద రెండవ ప్రోల శివాలయాన్ని కట్టిస్తే, ఆ తర్వాత వచ్చిన రుద్ర దేవుడు కోట నిర్మాణం మొదలు పెట్టినప్పటికీ అనుమకొండ నుండే పాలించాడు. దీనికి వెయ్యి స్తంభాల గుడిలోని శాసనమే రుజువు. అనుమకుండా పురవరేశ్వర.. అన్మకొండ పట్టణము నందు సుఖ సంకథా వినోదంబున రాజ్యంబు చేయుచునుండ.. అని స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి ఓరుగల్లు కోట నిర్మాణం గణపతి దేవుడి కాలంలో పూర్తి కాగా, ఆయన కూతురు రుద్రమదేవి దానిని మరింత పటిష్ఠం చేసిందని భావించాలి.
మూడు వరుసల్లో కోట గోడలున్న ఓరుగల్లు కోట నిర్మాణ పద్ధతి ప్రత్యేకమైనది. దక్షిణాసియా వాస్తు, శిల్ప శైలులపై విశేష పరిశోధన చేసిన జార్జ్ మిచెల్ ప్రకారం ఈ కోటను మత పరమైన ‘మండల’, ‘యంత్ర’ పద్ధతిలో, స్వస్తిక్ ఆకారంలో నిర్మించారు. ఓరుగల్లు కోట డిజైన్ ఒక కాస్మోగ్రామ్(విశ్వం పుట్టుక, ఇతర విశేషాలు వివరించే శాస్త్రం) అని ఆయన అభివర్ణించారు. 30 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో ఉన్న కీర్తి తోరణాల విశిష్టత గురించి ఫిలిప్ వాగనర్ వంటి చరిత్రకారులు వర్ణించారు.
అనుమకొండ కోటలో స్పష్టంగా జైన మత ప్రాముఖ్యత కనిపిస్తుంటే కాకతీయుల మత విశ్వాసానికి గుర్తుగా ఓరుగల్లు కోటలో శైవం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే స్వయంభూ ఆలయం మొదలు శిల్పాలపై ఉన్న ఆకృతుల వరకు చాలావాటిపై వైదిక మత ప్రభావమే ఎక్కువ.
ఆ కోట బయటి కోట 12.5 కిలోమీటర్ల వ్యాసంతో మట్టి కోట ఉన్నది. మధ్యలో 2.5 కిలోమీటర్ల వ్యాసంతో ఓరుగల్లు పట్టణం చుట్టూ మరో మట్టి కోట ఉన్నది. 20 అడుగుల ఎత్తున్న ఈ కోట గోడకు చుట్టూ లోతైన అగడ్త (నీళ్లతో నిండి, మొసళ్ళు, తామర తూళ్ళతో నిండిన పెద్ద గుంత), నాలుగు ద్వారాలు ఉన్నాయి. లోపలి వైపు 1.2 కిలో మీటర్ల వ్యాసంతో రాతి కోట ఉంది. ఇది రాజ్యానికి కీలకమైన కోటలోని ముఖ్య నిర్మాణాల్ని కాపాడే కంచు కోట. సాహిత్య ఆధారాల ప్రకారం ఈ కోటకు 72 బురుజులున్నాయి. కానీ కోటలో ప్రస్తుతం కనిపిస్తున్నవి 45 బురుజులే. కోటకు ఉన్న నాలుగు ద్వారాలు కూడా విశిష్టమైన నిర్మాణాలే. ఈ కోట లోపలే రాజ ప్రాసాదాలు, అంతఃపురం, అధికారిక నివాసాలు, స్వయంభూ ఆలయం ఉండేవి. ఇప్పటికీ కోటలో మట్టిలో కూరుకుపోయి కనిపిస్తున్న ఆలయ నిర్మాణాలు ఉన్నాయి. కోటలో ఇప్పటికీ ఎక్కువ ధ్వంసం కాకుండా ఉన్న నిర్మాణం కాకతీయుల తర్వాత కాలంలో కట్టిన ఖుష్ మహల్.
ఎన్నో చారిత్రక ప్రదేశాల తవ్వకాలు, సంరక్షణ 1914 నుండే మొదలైంది. 1914-16 మధ్య కాలంలో వేయి స్తంభాల గుడి, రామప్ప, ఉప్పరపల్లి వంటి ప్రదేశాల్లో కాకతీయ కాలపు గుళ్ళూ, శాసనాలపై శ్రద్ధ చూపి సంరక్షించారు. 1935లో కోట మధ్యన ఉన్న స్వయంభూ ఆలయాన్ని శాస్త్రీయంగా తవ్వడం ముఖ్య పరిణామం. అప్పుడు ఆనాటి శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకైన నాలుగు అద్భుత తోరణాల మధ్య పెద్ద గజ శిల్పాలు, పీఠాలు చెల్లాచెదురుగా మట్టి దిబ్బల కింద దొరికినాయి.
కాకతీయుల బలానికి, రాజ్యానికి కేంద్రమైన ఈ కోటలు ఆనాడు శత్రువుల దాడికి గురైతే, నేడు నగరీకరణ ప్రభావంతో శిథిలాలుగా మిగిలినాయి. కోట గోడలు కేవలం చరిత్ర మాత్రమే చెప్పవు, చరిత్ర పట్ల మనకున్న దృక్పథాన్ని కూడా చాటుతాయి.
డాక్టర్: ఎం.ఎ. శ్రీనివాసన్: 81069 35000