వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ఆదివారం ఉదయం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఘటనా స్థలంలో లభించిన నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ కాల్పులకు తెగబడింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. టెక్సాస్లోని హ్యూస్టన్లో గత బుధవారం కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.